600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ..
- MediaFx
- Jul 21, 2024
- 1 min read
దేశంలో ఉద్యోగాలకు ఏ స్థాయిలో కాంపిటీషన్ ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఓ సంఘటన. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 600 ఉద్యోగాల కోసం ఏకంగా 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. అంతమంది ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రముఖ విమానాయన సంస్థ ఎయిరిండియా తాజాగా మంగళవారం రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించింది. ఇందులోని 600 ఎయిర్పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే కేవలం 600 పోస్టులకు గాను ఏకంగా 25000 వేల మంది నిరుద్యోగులు హాజరుకావడం గమనార్హం. ఇక ఎయిర్పోర్ట్ లోడర్ పోస్టుకు ఎంపికైతే జీతం.. రూ. 20 వేల నుంచి రూ. 25 వేల మధ్యే ఉండడం గమనార్హం. ఒక్కసారిగా వేలాది మంది తరలిరావడంతో అభ్యర్ధుల ఎంపిక, ఫారమ్ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇంటర్వ్యూకి వచ్చిన వారు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనమని పలువురు రాజకీయ నాయకులు అధికార పార్టీని విమర్శిస్తున్నారు.